భీమ్ ఇండియా టుడే న్యూస్.వర్ధన్నపేట్ హన్మకొండ జిల్లా వర్ధన్నపేట రాయపర్తి: ఖమ్మం–వరంగల్ జాతీయ రహదారిపై రాయపర్తి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఎదుట శనివారం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో రాయపర్తి గ్రామానికి చెందిన గారే వీరయ్య అలియాస్ మల్లయ్య (55) మృతి చెందినట్లు సమాచారం.
స్థానికుల వివరాల ప్రకారం.. వీరయ్య కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగించేవాడు. వీరయ్యకు భార్య మరియమ్మతో పాటు కుమారుడు కృష్ణ, కుమార్తె శారద ఉన్నారు. రోజువారీ కూలీ పనులకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఖమ్మం–వరంగల్ హైవేపై రాయపర్తి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ సమీపంలో గుర్తుతెలియని వాహనం వీరయ్యను ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదానికి కారణమైన వాహనం, డ్రైవర్ వివరాలు తెలియాల్సి ఉంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. ప్రమాదానికి కారణమైన గుర్తుతెలియని వాహనం కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనతో రాయపర్తి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

