మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వేముల పుష్పలత
భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ తెలంగాణ శాసనసభ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ప్రవర్తించిన తీరు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని హుజూరాబాద్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వేముల పుష్పలత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒక దళితుడు అత్యున్నత రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిలో ఉండటాన్ని జీర్ణించుకోలేకే బీఆర్ఎస్ పార్టీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆమె ఆరోపించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… శాసనమండలి సభ్యుడు తాతా మధు స్పీకర్ను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సభాపతి స్థానాన్ని కించపరచడమే కాకుండా, స్పీకర్ తల్లిపై చేసిన వ్యాఖ్యలు యావత్ మహిళా లోకానికే తీరని అవమానమని మండిపడ్డారు. తాతా మధు తక్షణమే తెలంగాణలోని దళిత సమాజానికి, మహిళా లోకానికి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రాజ్యాంగ విలువలనే కాలరాస్తూ మాట్లాడిన ఎమ్మెల్సీ తాతా మధు శాసనమండలి సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, సీనియర్ నాయకుల పిలుపుమేరకు ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసేంత వరకు, క్షమాపణ చెప్పేంత వరకు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని పుష్పలత హెచ్చరించారు.

