కలం అమ్ముడైతే… నిజం ఎవరు రాస్తారు?
జర్నలిజానికి ఒక్కటే స్టాండ్, ప్రజల పక్షమే..! డబ్బు, రాజకీయ ఒత్తిళ్లు, పెయిడ్ ప్యాకేజీల మధ్య కనుమరుగవుతున్న నిజాయితీ.
జర్నలిజంపై భీమ్ ఇండియా టుడే న్యూస్ సంచలనం సంపాదకీయం…
నిజాన్ని ప్రశ్నించే గొంతు బలహీనపడితే… అన్యాయానికి బలం చేకూరుతుంది.
కలం ఒక వ్యాపార వస్తువుగా మారకూడదు. అది ప్రజల కోసం ఎగరేసే జెండా కావాలి..!
జర్నలిజానికి ఒక్కటే స్టాండ్… నిజం వైపే నిలబడాలి…!
దశాబ్దాలుగా కొన్ని సందర్భాల్లో శాటిలైట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మెయిన్స్ట్రీమ్ మీడియా, ప్రింట్ మీడియా, రాజకీయ పార్టీలు, అధికారంలో ఉన్న నాయకులు, డబ్బున్న ధనవంతులు, పరిశ్రమల యాజమాన్యాల ప్రయోజనాల కోసం పనిచేసిన సందర్భాలు మనం చూశాం. డబ్బు, పదవులు, ప్యాకేజీలు, ప్రకటనలు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం నిజాలను భూస్థాపితం చేసి, అబద్ధాలను నిజాలుగా ప్రజలను నమ్మించే ప్రయత్నాలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇది జర్నలిజానికి అత్యంత బాధాకరమైన పరిస్థితి.
గత కొన్నేళ్లుగా సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, ఆన్లైన్ పత్రికలు విస్తరించడంతో సామాన్యుడి చేతిలో కూడా ఒక మీడియా వేదిక వచ్చింది. ప్రారంభంలో ఎంతో కష్టపడి, ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి, తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న కొందరు డిజిటల్ మీడియా ప్రతినిధులు కూడా కాలక్రమేణా సిండికేట్లుగా ఏర్పడి, పెయిడ్ బ్యాచ్లుగా మారి, ప్యాకేజీలకు అమ్ముడుపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇది నిజమైన జర్నలిజాన్ని ప్రేమించే
ప్రతి ఒక్కరికీ బాధ కలిగించే విషయం.
కాగితం, కలం, కెమెరా ఎప్పుడో చనిపోలేదు… వాటిని అమ్ముకునే మనస్తత్వమే జర్నలిజం విలువలను చంపుతోంది.
నిజమైన జర్నలిస్ట్ అంటే ఎవరు…?
సైకిల్ స్టాండ్లా, బస్టాండ్లా జర్నలిజానికి పన్నెండు స్టాండ్లు ఉండవు. ఒక్కటే స్టాండ్ ఉంటుంది—అది నిజం వైపు నిలబడే స్టాండ్.
ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు లేకుండా…
ఏ డబ్బు ఆశించకుండా…
ఏ రాజకీయ పార్టీకి తొత్తుగా మారకుండా…
ఏ నాయకుడి ఒత్తిడికి తలొగ్గకుండా…
ఏ ధనవంతుడి ప్రయోజనాలకు అమ్ముడుపోకుండా…
నిజాన్ని నిర్భయంగా ప్రశ్నించే గొంతుకే నిజమైన జర్నలిజం.
సమాజంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను, అవినీతిని, దోపిడీని, ప్రజా వ్యతిరేక చర్యలను క్షణక్షణం గమనిస్తూ, వాస్తవాలను క్షుణ్ణంగా పరిశీలించి, క్లుప్తంగా అయినా స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడమే జర్నలిజం.
కలం ఒక ఆయుధం.
అక్షరం ఒక బాధ్యత.
కెమెరా ఒక సాక్ష్యం.
నిజం ఒక నిబద్ధత.
ఆ నిబద్ధతను చివరి శ్వాస వరకు వదలకుండా, విధి నిర్వహణలో ప్రాణాలను సైతం కోల్పోయిన అమర జర్నలిస్టులకు హృదయపూర్వక నమస్సుమాంజలి.
వారి త్యాగం మనకు ఒకే
విషయాన్ని గుర్తుచేస్తుంది.
జర్నలిజం ఒక వ్యాపారం కాదు…
జర్నలిజం ఒక బాధ్యత.
జర్నలిజం ఒక పదవి కాదు…
జర్నలిజం ఒక ప్రజా ధర్మం.
పేదలకు, నిరుపేదలకు, మధ్యతరగతి కుటుంబాలకు అన్యాయం జరిగినప్పుడు వారి తరఫున ప్రశ్నించే నిజాయితీ గల జర్నలిస్టు గొంతుక ఎంతో అవసరం. ఎందుకంటే అధికారాన్ని ప్రశ్నించగలిగే ధైర్యం ఉన్న కలం మాత్రమే బలహీనుడికి అండగా నిలబడగలదు.
అందుకే ఇప్పటికైనా మనం ఆలోచించాలి.
ఎవరినీ సంతోషపెట్టడానికి కాదు…
ఎవరినీ భయపెట్టడానికి కాదు…
ఎవరి దగ్గరా డబ్బు తీసుకోవడానికి కాదు…
ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం కాదు…
ప్రజల కోసం, నిజం కోసం, న్యాయం కోసం నిలబడే జర్నలిజాన్ని తిరిగి బలపరచాలి.
ఇప్పటికీ అక్కడక్కడా ఎలాంటి ఒత్తిడులకు లొంగకుండా, ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా, ప్రజల పక్షాన నిలబడి నిజాన్ని నిర్భయంగా రాస్తున్న జర్నలిస్టు మిత్రులకు మనస్ఫూర్తిగా నమస్కారం.

