*దాడి చేసినవారే బాధితులమంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు..*
దాడి చేసిన వారు చట్టాన్ని చేతులకు తీసుకొని పోలీస్ వ్యవస్థకు సవాలు విసరడం సహించరాని నేరం..
–ఆరోపణలు కాదు ఆధారాలు చూపెట్టాలని అంటున్న బాధితుడు..నిందితుల పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్..
( భీమ్ ఇండియా టుడే ప్రతినిది పెద్దపల్లి)
తనపై దాడికి పాల్పడిన వ్యక్తులు కొట్టినవారే మాదే కరెక్ట్ అన్నటుగా అరుస్తున్నట్లుగా‘ వ్యవహరిస్తున్నారని సుమన్టీవీ జర్నలిస్టు సోమ శ్రీకాంత్ ఆరోపించారు. తనపై దాడి చేసిన అనంతరం తామే బాధితులమన్నట్లు ప్రచారం చేయడంతో పాటు, తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. అంతమందికి ఒకేసారి సెలవు మంజూరు చేయడం సాధ్యమేనా అని శ్రీకాంత్ ప్రశ్నించారు. ఒకవేళ అదే నిజమైతే ఆసుపత్రిలో సిబ్బంది లేకుండా ఇబ్బంది లేకుండా చక్కదిద్దడం సాధ్యమేనా అని ఆయన ప్రశ్నించారు.మంగళవారం జిల్లాకేంద్రంలోని ప్రెస్క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడిన శ్రీకాంత్,తనపై చేసిన ప్రతి ఆరోపణకు ఆధారాలు చూపించాలని సవాల్ విసిరారు. తాను ఎప్పుడూ ఎవరైనా మద్యం సేవిస్తున్న సమయంలో ఫొటోలు లేదా వీడియోలు తీయలేదని,ఎవరినీ ఫోన్ ద్వారా బెదిరించలేదని స్పష్టం చేశారు. అలాంటి ఆరోపణలు నిజమైతే సంబంధిత ఫొటోలు, వీడియోలు లేదా కాల్ రికార్డింగ్స్ ను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. తాను కేవలం డీసీహెచ్వో ను కలిసి, అవుట్పేషెంట్ కేర్ సిబ్బందిలో కొందరు మద్యం సేవిస్తున్నారనే సమాచారం అందిందని, వారు ఆ సమయంలో విధుల్లో ఉన్నారా లేదా అనే విషయాన్ని మాత్రమే అడిగానని తెలిపారు.దీనిపై డీసీహెచ్వో సంబంధిత సూపర్వైజర్ను పిలిచి డ్యూటీలో ఉన్న సిబ్బంది వివరాలు తెలుసుకున్నారని చెప్పారు. అనంతరం డ్యూటీలో ఉన్నారని గుర్తించిన 14 మంది సిబ్బందికి తన గురించి సమాచారం చేరడంతో, వారు తన ఇంటి వద్దకు వెళ్లి రెక్కీ నిర్వహించారని, తన భార్య, తల్లితో దుర్భాషలాడారని ఆరోపించారు.ముందస్తు ప్రణాళిక ప్రకారమే తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు. అందులో భాగంగానే నన్ను రబ్బాన్ హోటల్ వద్దకు పిలిపించి, ముకుమ్మడిగా నా పై దాడి చేసి హత్య చేయాలని చూశారని అన్నారు.తనపై జరిగిన దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లు,కాల్ రికార్డింగ్స్తో పాటు ఇతర ఆధారాలను మీడియా సమావేశంలో శ్రీకాంత్ చూపెట్టినాడు.నాపై హత్యయత్నం చేసినట్లుగా బలమైన సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ నిందితులపై చర్యలు తీసుకోవడంలో ఆలస్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ వ్యవహారంలో నిందితులకు ఎవరి అండదండలు ఉన్నాయో ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా తనపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, పోలీసు అధికారులను ఆయన కోరారు.ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త కొంకటి లింగమూర్తి మాట్లాడుతూ ప్రజలకు వాస్తవాలను చేరవేయాల్సిన మీడియా ప్రతినిధులపై దాడులు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. జర్నలిస్టుల భద్రతకు ప్రభుత్వం హామీ ఇవ్వాలని, దాడికి పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రమేష్, శ్రీనివాస్, సురేష్, రాజు, ఇల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

