భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ఆగా ఖాన్ ఫౌండేషన్ ద్వారా మరింత సహకారం అందించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని విద్యా, పర్యాటక, వైద్య రంగాల్లో కలిసి పని చేద్దామని కోరారు.
భారత పర్యటనలో ఉన్న ఆగా ఖాన్ ఫౌండేషన్ చైర్మన్ హిజ్ హైనెస్ ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-V గారు హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి వారితో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.
తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో జరిగిన ఈ సమావేశంలో ఆగా ఖాన్ ఫౌండేషన్ ద్వారా తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఆగా ఖాన్ ఫౌండేషన్పై అత్యంత గౌరవం ఉందని పేర్కొంటూ, హైదరాబాద్తో ఆగా ఖాన్ గారి కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు
తెలంగాణ వారసత్వ సంపదను పునరుద్ధరించడంలో ఫౌండేషన్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ఫౌండేషన్ సహకారంతో ఇటీవల శాసనమండలి భవనాన్ని పునరుద్ధరించడం, అలాగే నగరంలోని కుతుబ్ షాహీ టూంబ్స్ను పునరుద్ధరించిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.
హైదరాబాద్ నగర పునర్నిర్మాణంలో భాగంగా మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుపై సిద్ధం చేసిన ప్రణాళికలను ముఖ్యమంత్రి వివరించారు. మూసీ నది వెంట నైట్ ఎకానమీ కార్యకలాపాల దిశగా తీర్చిదిద్దుతున్న విషయాలను తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న చారిత్రక సిటీ కాలేజ్, ఉస్మానియా ఆసుపత్రి భవనాల పునరుద్ధరణలో సహకరించాలని కోరారు.
ఉస్మానియా ఆసుపత్రి కోసం గోషామహల్లో నూతన భవనాన్ని నిర్మిస్తున్నామని, ప్రస్తుత ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని వారసత్వ సంపదగా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్టు వివరించారు.
డిసెంబర్ 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మూడు రోజుల పాటు భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించబోయే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు హాజరు కావాలని ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-V గారిని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. సమ్మిట్కు 100కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు.
ఫ్యూచర్ సిటీ నిర్మాణంపై ప్రిన్స్ ఆగా ఖాన్-V ఆసక్తిని కనబరిచి దాని ప్రాధాన్యతను అడిగి తెలుసుకున్నారు. 30 వేల ఎకరాల్లో అత్యాధునిక సదుపాయాలతో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని, అంతర్జాతీయ విమానాశ్రయానికి 20 నిమిషాల దూరంలో నిర్మించే ఫ్యూచర్ సిటీ పూర్తిగా నెట్-జీరో సిటీగా ఉండబోతోందని ముఖ్యమంత్రి తెలిపారు.
సింగపూర్కు చెందిన కంపెనీ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ను రూపొందిస్తోందని, ఇందులో దాదాపు 15 వేల ఎకరాల్లో గ్రీన్ జోన్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఫ్యూచర్ సిటీలో అమెజాన్ వంటి సంస్థలు ఇప్పటికే తమ కార్యకలాపాలను ప్రారంభించాయని గుర్తుచేస్తూ 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని వివరించారు.
ఇటీవల బ్రిటన్, అమెరికా పర్యటనల్లో వివిధ ప్రపంచస్థాయి యూనివర్సిటీలతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల గురించి సీఎం సలహాదారు కె. రామకృష్ణా రావు సమావేశంలో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-V గారికి వివరించారు.
హార్వర్డ్ యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్తో పాటు ఇతర యూనివర్సిటీలు హైదరాబాద్లో తమ కార్యకలాపాలు ప్రారంభించడానికి అంగీకరించాయని తెలిపారు. ఫ్యూచర్ సిటీలో ఆగా ఖాన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా గారు కోరారు. పర్యాటక రంగంలో అగా ఖాన్ ఫౌండేషన్ పాత్రను స్పెషల్ చీఫ్ సెక్రటరీ వాణీ ప్రసాద్ గారు గుర్తుచేస్తూ భవిష్యత్తులో మరింత సహకారం అందించాలని కోరారు.
ఈ సమావేశంలో మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గారితో పాటు ఉన్నతాధికారులు, ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

