రాహుల్ గాంధీని చూసి నాయకులు నేర్చుకోవాలి: దళిత నాయకులు
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్, సెప్టెంబర్ 15: దళిత సమాజం పట్ల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చూపుతున్న గౌరవాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని పలువురు దళిత నాయకులు అన్నారు. తరతరాలుగా సామాజికంగా వెనుకబడిన వర్గాల పట్ల గౌరవం, సమానత్వ భావనతో రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్న తీరు ప్రశంసనీయమని పేర్కొన్నారు.
దళితుల పట్ల తమకు ఎంతో గౌరవం ఉందని చెప్పుకుంటూ, రాజకీయ అవసరాల కోసం దళితవాడల్లో భోజనాలు చేయడం, వివిధ పథకాల పేర్లు చెప్పడం వంటి చర్యలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు విమర్శించారు. ఇలాంటి రాజకీయ ప్రచారాల వెనుక ఉన్న వాస్తవాలను దళిత సమాజం ఒక్కసారి ఆలోచించాలని సూచించారు.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పట్ల రాహుల్ గాంధీ చూపుతున్న గౌరవం, ఆయనతో కలిసి వ్యవహరిస్తున్న తీరు సామాజిక సమానత్వానికి ప్రతీకగా నిలుస్తోందని అన్నారు. నాయకత్వ స్థానాల్లో ఉన్న వ్యక్తుల పట్ల కులం, ప్రాంతం అనే తేడా లేకుండా గౌరవంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
దళిత సమాజంలో ఉన్న ఐక్యతను రాజకీయ పార్టీలు గుర్తించాలని నాయకులు అన్నారు. తెలంగాణలో దళితుల ఓట్లు సుమారు 70 లక్షల వరకు ఉన్నాయని పేర్కొంటూ, దళితులకు వ్యతిరేకంగా మాట్లాడే లేదా అవమానించే వ్యక్తులు రాజకీయంగా ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
దళిత సమాజాన్ని అవమానించిన వారితో కలిసి నడిచే వారిని కూడా దళితులు ప్రశ్నించాలని, దళిత వ్యతిరేక వైఖరి ఉన్న వారిని గుర్తించి తగిన విధంగా స్పందించాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో దళిత బిడ్డలు ఎవరు తమను నిజంగా గౌరవిస్తున్నారు, ఎవరు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం దళితుల పేరును ఉపయోగిస్తున్నారో గమనించాలని వారు కోరారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేకు సంబంధించిన ఈ సన్నివేశాలను చూసైనా దళిత సమాజం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు.

