భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ చారిత్రక హైదరాబాద్ ఒరిజినల్ సిటీ (ఓల్డ్ సిటీ) ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి రాజకీయాలకు అతీతంగా శాయశక్తులా ప్రయత్నం చేస్తామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. దేశంలోనే అభివృద్ధి చెందిన అతిపెద్ద నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దాలన్న సంకల్పంతో పనిచేస్తున్నామని అన్నారు.
చంచల్గూడ నుంచి సంతోష్నగర్ వరకు 3.2 కి.మీ. మేర నిర్మించిన స్టీల్ ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి ప్రారంభించిన సందర్భంగా చంచల్గూడ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హైదరాబాద్ ఒరిజినల్ సిటీకి పలు వరాలు ప్రకటించారు. చంచల్గూడ డిగ్రీ కాలేజీ అభివృద్ధికి రూ. 25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. నెల రోజుల్లోగా అందుకు సంబంధించిన జీవో జారీ చేయడమే కాకుండా వచ్చే ఏడాదిన్నరలోగా పనులు పూర్తయ్యేలా పర్యవేక్షించాలని మలక్ పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా గారికి సూచించారు.
ఈ వేదికగా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రస్తావించిన పలు అభివృద్ధి పనులన్నింటినీ మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంతైనా ఖర్చు చేస్తుందని తెలిపారు.
రూ. 500 కోట్లతో మీరాలం ట్యాంకును అత్యద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని, ఆరాంఘర్ ఫ్లైఓవర్, శాస్త్రిపురంలో ఫ్లైఓవర్ను పూర్తి చేశామని చెప్పారు. అండర్గ్రౌండ్ కేబుల్ పనులు, రోడ్ల పనులు జరుగుతున్నాయని చెప్పారు. భూసేకరణ ప్రక్రియ పూర్తి కావచ్చిన నేపథ్యంలో వచ్చే డిసెంబర్లో గౌలిగూడ నుంచి చాంద్రాయణగుట్ట మెట్రో రైలు విస్తరణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు.