జమ్మికుంటలో రేషన్ డీలర్ .షాపుపై ఆకస్మిక తనిఖీ:
భీమ్ ఇండియా టుడే న్యూస్ జమ్మికుంట లబ్ధిదారులతో మాట్లాడిన కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్:
సన్న బియ్యం నాణ్యతపై లబ్ధిదారుల అభిప్రాయాలను స్వయంగా తెలుసుకున్న ప్రణవ్
మూడు పూటలా కడుపునిండా అన్నం తింటున్నాం.. కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు” అంటూ లబ్ధిదారుల హర్షం:
స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు భారీగా పాల్గొన్న తనిఖీ కార్యక్రమం
జమ్మికుంట పట్టణంలోని 11వ వార్డులో ఉన్న ప్రభుత్వ చౌకధరల దుకాణాన్ని (రేషన్ డీలర్ షాపు) హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రేషన్ షాపులో పంపిణీ చేస్తున్న సన్న బియ్యం నాణ్యత, పంపిణీ విధానం, లబ్ధిదారులకు అందుతున్న సేవలపై స్వయంగా ఆరా తీశారు.రేషన్ తీసుకోవడానికి వచ్చిన లబ్ధిదారులతో మాట్లాడిన ప్రణవ్, ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యంపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. దీనికి స్పందించిన లబ్ధిదారులు గతంలో అందించిన దొడ్డు బియ్యం వంటకు అంతగా ఉపయోగపడక ఇతర అవసరాలకు వినియోగించాల్సి వచ్చేదని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం నాణ్యంగా ఉండటంతో మూడు పూటలా కడుపునిండా అన్నం తింటున్నామని ఆనందం వ్యక్తం చేశారు.సన్న బియ్యం పంపిణీ ద్వారా పేద కుటుంబాలకు మేలు జరుగుతోందని, ఈ నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని లబ్ధిదారులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వొడితల ప్రణవ్ మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హులైన లబ్ధిదారునికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేరేలా నిరంతరం పర్యవేక్షిస్తామని చెప్పారు. ప్రజలకు నాణ్యమైన రేషన్ సరుకులు అందేలా అధికారులు, డీలర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ పొనగంటి విష్ణువర్ధన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్, స్థానిక కౌన్సిలర్లు, వార్డు అధ్యక్షులు, మండల అధ్యక్షురాలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

