భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ ఉద్యమకారుల డిమాండ్ల సాధన కోసం TUJAC ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరాహార దీక్ష
మల్కాజిగిరి: ప్రభుత్వ ఆలస్య వైఖరికి నిరసనగా తెలంగాణ ఉద్యమకారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ TUJAC ఆధ్వర్యంలో సోమవారం ఆగస్టు 17న మల్కాజిగిరి నేరేడ్మెట్ చౌరస్తాలోని అమరవీరుల స్థూపం వద్ద ఒక్కరోజు నిరాహార దీక్ష నిర్వహించారు.
TUJAC రాష్ట్ర అధ్యక్షులు గౌరవ సుల్తాన్ యాదగిరి నాయకత్వంలో, మల్కాజిగిరి నియోజకవర్గ TUJAC అధ్యక్షులు బి.ఎన్. జాంబవ అధ్యక్షతన ఈ దీక్ష జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఉద్యమకారులకు నెలకు రూ.25 వేల పెన్షన్, 250 గజాల ఇంటి స్థలం, ఇల్లు నిర్మించుకునేందుకు రూ.10 లక్షల ఆర్థిక సహాయం, వారి కుటుంబాలకు హెల్త్ కార్డులు, అలాగే అమరవీరుల స్మృతి వనం ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన ఉద్యమకారుల కుటుంబాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఉద్యమకారులు వయస్సు మీద పడుతున్నారని, అనేక మంది అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు పేర్కొన్నారు. కేకే కమిటీ పెద్దలు ఉద్యమకారులను గుర్తించి, వారి సమస్యలు మరియు డిమాండ్లను అత్యంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
గత పదేళ్లుగా అధికారంలో ఉన్న ప్రభుత్వం ఉద్యమకారులను నిర్లక్ష్యం చేసిందని వారు ఆరోపించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ప్రస్తుత ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు.
ఉద్యమకారుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే భవిష్యత్తులో మరింత మిలిటెంట్ తరహా ఉద్యమాలు, ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని నాయకులు హెచ్చరించారు. ఈ సందర్భంగా తమ డిమాండ్ల సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో అంబర్పేట్ నియోజకవర్గ TUJAC అధ్యక్షులు బి.వి. రమణ, సి. దేవానందు, పెంటం నర్సింహ, బాషాపాక సత్యనారాయణ, మంద లావణ్య, కుసుమ విజయలక్ష్మి, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

