ప్రతిపక్షంలోకి ఆహ్వానం.. బీసీ మహిళకు అన్యాయం చేస్తున్నారంటూ ఆరోపణలు
భీమ్ ఇండియా టుడే న్యూస్హైదరాబాద్, సెప్టెంబర్ 03: మంత్రి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పిస్తున్నారనే ప్రచారంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. ఈ సందర్భంగా కొండా సురేఖను తన ప్రజాశాంతి పార్టీలోకి రావాలని ఆయన ఆహ్వానించారు.
బీసీ వర్గానికి చెందిన మహిళ కావడం వల్లే కొండా సురేఖపై చర్యలు తీసుకునే ప్రయత్నం జరుగుతోందని కేఏ పాల్ ఆరోపించారు. బీసీలకు అన్యాయం జరుగుతోందని, రాజకీయాల్లో సామాజిక న్యాయం పాటించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
కొండా సురేఖ రాజకీయంగా ప్రజల్లో మంచి గుర్తింపు ఉన్న నాయకురాలని, ఆమె వంటి నాయకులు ప్రజల సమస్యలపై మరింత బలంగా పోరాడాల్సిన అవసరం ఉందని కేఏ పాల్ అభిప్రాయపడ్డారు. అందుకే సురేఖ ప్రజాశాంతి పార్టీలో చేరితే బీసీలు, పేదలు, అణగారిన వర్గాల కోసం కలిసి పనిచేయవచ్చని ఆయన పిలుపునిచ్చారు.
మంత్రి పదవి నుంచి సురేఖను తప్పిస్తారన్న ప్రచారం నేపథ్యంలో కేఏ పాల్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే మంత్రి పదవి విషయంలో అధికారికంగా ఎలాంటి నిర్ణయం వెలువడిందనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.