Friday, August 28, 2026
Homeతెలంగాణఅర్హులైన జర్నలిస్టులకు న్యాయం జరిగే వరకు పోరాటం: వన్నాల శివాజీ

అర్హులైన జర్నలిస్టులకు న్యాయం జరిగే వరకు పోరాటం: వన్నాల శివాజీ

📰 Generate e-Paper Clip

అర్హులైన జర్నలిస్టులకు న్యాయం జరిగే వరకు పోరాటం: వన్నాల శివాజీ

 భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్‌ లో జర్నలిస్టుల నిరాహార దీక్షకు ఉపసర్పంచ్‌ల ఫోరం మద్దతు హుజురాబాద్: జర్నలిస్టులకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేటాయించిన నివేశన స్థలాలపై దాఖలైన కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని హుజురాబాద్ ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు వన్నాల శివాజీ డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వాలు గౌరవించాలని, అర్హులైన ప్రతి జర్నలిస్టుకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద TUWJ హుజురాబాద్ యూనియన్ అధ్యక్షులు కాగిత రాములు, ప్రధాన కార్యదర్శి కాముని రవీందర్ ఆధ్వర్యంలో జర్నలిస్టు మిత్రులు చేపట్టిన నిరాహార దీక్షకు వన్నాల శివాజీ హాజరై సంఘీభావం తెలిపారు. జర్నలిస్టుల డిమాండ్లను అడిగి తెలుసుకుని, వారి పోరాటానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు.

ఈ సందర్భంగా వన్నాల శివాజీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో అప్పటి ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి పలు హామీలు ఇచ్చిందని గుర్తుచేశారు. అందులో భాగంగా హుజురాబాద్ ప్రాంతంలోని అర్హులైన జర్నలిస్టులకు నివేశన స్థలాలు కేటాయించారని తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో ఇళ్లు నిర్మించుకోవాలని ఆశించిన జర్నలిస్టులకు ప్రస్తుతం ఎదురవుతున్న న్యాయపరమైన సమస్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు.

స్థలాల విషయంలో కోర్టులో దాఖలైన పిటిషన్‌ను సంబంధిత వ్యక్తులు, ప్రభుత్వం పరిశీలించి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని ఆయన కోరారు. జర్నలిస్టులకు కేటాయించిన స్థలాలపై వివాదాలను సృష్టించడం ద్వారా వారి కుటుంబాలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. జర్నలిస్టులు సంవత్సరాలుగా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు.

ప్రభుత్వాలు మారవచ్చు.. కానీ ప్రజలకు సమాచారం అందించే జర్నలిస్టుల పాత్ర మాత్రం ఎప్పటికీ కీలకమే. జర్నలిస్టులు లేకుండా ఏ ప్రభుత్వం తన సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తుంది?” అని వన్నాల శివాజీ ప్రశ్నించారు.జర్నలిస్టులకు కనీస వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని అన్నారు. జీతాలు, ఉద్యోగ భద్రత వంటి అనేక సమస్యల మధ్య పనిచేస్తున్న జర్నలిస్టులు తమ సొంత ఇల్లు నిర్మించుకునేందుకు ఒక నివేశన స్థలం కోరితే, దానిని కూడా వివాదాస్పదం చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో జర్నలిస్టులకు కేటాయించిన నివేశన స్థలాల విషయంలో ఇంకా అర్హత ఉన్నప్పటికీ స్థలం పొందని జర్నలిస్టులను కూడా గుర్తించి న్యాయం చేయాలని ఆయన కోరారు. ఒక ప్రభుత్వ హయాంలో కొంతమందికి స్థలాలు కేటాయించబడి ఉంటే, మిగిలిన అర్హులైన జర్నలిస్టులకు కూడా నిబంధనల ప్రకారం అవకాశం కల్పించాలని సూచించారు.

జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి, చర్చల ద్వారా పరిష్కారం చూపాలని వన్నాల శివాజీ డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై అనవసరమైన న్యాయపరమైన వివాదాలు లేకుండా వారికి కేటాయించిన స్థలాలపై స్పష్టత ఇవ్వాలని కోరారు.

జర్నలిస్టులకు కేటాయించిన నివేశన స్థలాలు పూర్తిగా వారికి దక్కే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే జర్నలిస్టులతో కలిసి మరింత పెద్ద ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.

జర్నలిస్టుల సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి, అర్హులైన జర్నలిస్టులకు న్యాయం చేయాలని వన్నాల శివాజీ కోరారు. జర్నలిస్టుల నిరాహార దీక్షకు తమ ఉపసర్పంచ్‌ల ఫోరం తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.