కసాయి తల్లి.. చెరువులో ముంచి 9 నెలల చిన్నారిని హత్య చేసిన తల్లి
బీమ్ ఇండియా టుడే ప్రతినిధి :- హైదరాబాద్ ఎల్బీ నగర్ సమీపంలోని బైరామల్గూడలో దారుణం.. మద్యం మత్తులో చిన్నారిని చెరువులోకి తీసుకెళ్లిన తల్లి.. నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్లోని ఎల్బీ నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న బైరామల్గూడ చెరువు వద్ద ఆదివారం సాయంత్రం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, రాజేశ్వరి అనే మహిళ మద్యం మత్తులో తన 9 నెలల కుమార్తె అనురాధను చెరువులో ముంచి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని చిన్నారిని బయటకు తీశారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలు రాజేశ్వరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కుటుంబ కలహాలా, మద్యం మత్తు ప్రభావమా, లేక ఇతర కారణాలా అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపగా, చిన్నారి మృతితో స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.

