భీమ్ ఇండియా టుడే న్యూస్ ములుగు: గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి ప్రణాళికకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,145 గ్రామీణ రహదారుల అభివృద్ధికి శుభారంభం పలికారు. గ్రామీణ రహదారుల అభివృద్ధికి సంబంధించి ములుగులో ఏర్పాటు చేసిన పైలాన్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
పంచాయతీ రాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ములుగు జిల్లా గట్టమ్మ ఆలయం ఎదురుగా నిర్మించిన హ్యామ్ రోడ్ల పైలాన్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
గ్రామ పంచాయతీల నుంచి మండల కేంద్రాలు, రాష్ట్రంలోని ప్రధాన రహదారులకు రోడ్లను అభివృద్ధి చేసి అనుసంధానం చేసే ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ రవాణా రంగంలో సరికొత్త అధ్యాయానికి ములుగు కేంద్రంగా తొలి అడుగు పడింది.
ఈ కార్యక్రమంలో మంత్రులు ధనసరి అనసూయ సీతక్క పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారితో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ములుగు జిల్లాలో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ భవన సముదాయాన్ని (IDOC) ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ములుగు జిల్లా సమగ్రాభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేస్తామని చెప్పారు. వేయి స్తంభాల గుడితో పోటీ పడే విధంగా వనదేవతలు సమ్మక్క – సారలమ్మ దేవాలయాన్ని అభివృద్ధి చేశారని చెప్పారు.ములుగు ప్రాంతానికి సంబంధించి ప్రత్యేకంగా జంపన్నవాగును నూటికి నూరు శాతం అభివృద్ధి చేస్తామన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేకంగా సమీక్షించి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు.
జిల్లా కేంద్రంలో ఎస్పీ కార్యాలయంతో పాటు కోర్టు భవనాలను నిర్మించాలని మంత్రి సీతక్క చేసిన సూచనల మేరకు వాటిని త్వరలోనే చేపడుతామని తెలిపారు. మల్లూరు నరసింహ స్వామి దేవాలయానికి కూడా నిధులు మంజూరు చేస్తామని చెప్పారు.
ఈ ప్రాంతంలోని ఆదివాసీ బిడ్డలు కష్టానికి మారుపేరు. మీ కష్టాలు తీరాలంటే, సాగునీరు అందించాలి. సాగునీటికి సంబంధించిన ప్రాజెక్టులను మంత్రి పొంగులేటి గారు త్వరలోనే సమీక్ష చేసి, అవసరమైన నిధులు మంజూరు చేస్తారని తెలిపారు.ఈ ప్రాంతంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్, ఏటీసీలతో పాటు భవిష్యత్తులో సాంకేతిక విద్యను అందించడానికి ఈ ప్రాంత నిరుద్యోగుల కోసం ఏం కావాలన్నా నిధులను మంజూరు చేస్తామన్నారు.
రైతులు, ఆడపడుచులు, నిరుద్యోగ యువకులు, విద్యార్థుల విషయంలో ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో ముందుకు పోతుందని వివరించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు తమ ఫోకస్ను మార్చుకోవాలని సూచించారు.
నర్సరీ నుండి 12వ వరకు విద్యకు ప్రాధాన్యతనిచ్చి, ఆ తర్వాత స్కిల్స్ నేర్చుకోవాలని ఈ సందర్భంగా యువతకు సూచించారు. విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యం ఉన్నప్పుడే ప్రపంచంతో పోటీపడి రాణించగలరని, విద్య, సాంకేతిక నైపుణ్యం ఉంటే ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని అన్నారు.
మీరు అండగా నిలబడండి. మీ సమస్యలన్నింటిని పరిష్కరిస్తాం. రాష్ట్రంలో పాడి పంటలు పండించుకుందాం. తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా తీర్చిదిద్దుకుందాం” అని పిలుపునిచ్చారు.

