BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 12:41 pm Posted by : Reporter Srikanth

తాగునీరు, విద్యుత్ కొరత తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ ఎల్‌నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనడంలో కేంద్ర ప్రభుత్వం అవసరమైన సహకారం అందించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని కోరారు.

 దక్షిణ రాష్ట్రాల వ్యవసాయ సదస్సులో పాల్గొనడానికి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్  హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి  వారిని కలిసి వర్షాభావం, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కేంద్ర మంత్రికి వివరించారు.

 మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రానికి అవసరమైన సహకారం అందించాలని కోరుతూ వివరాలతో వినతిపత్రాన్ని అందజేశారు.

  •  వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయ రంగంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందని తెలిపారు. అలాగే, తాగునీరు, విద్యుత్ కొరత తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసిందని వివరించారు.

 ఎల్‌నినో నేపథ్యంలో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తున్నామని ముఖ్యమంత్రి  చెప్పారు. పంటల మార్పిడిపై రైతులను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని గుర్తించి రాష్ట్రానికి అవసరమైన సహకారాన్ని అందించాలని కోరారు. 

 ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలన్న ఆలోచనతో 250 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో పండ్లు, కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా చెప్పారు.

PMAYG పథకంలో భాగంగా మొదటి విడతగా రాష్ట్రానికి 2 లక్షల ఇండ్లను కేటాయించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ అందుకు కేంద్ర మంత్రి గారికి ముఖ్యమంత్రి  కృతజ్ఞతలు చెప్పారు. రాష్ట్రంలో 11,56,915 అర్హులైన గ్రామీణ కుటుంబాలకు ఇండ్లు మంజూరు చేయాలని గత జూలైలో కేంద్రమంత్రికి ఢిల్లీలో వినతిపత్రం అందించిన విషయాన్ని ప్రస్తావించారు.

 రాష్ట్రంలో డిమాండ్‌కు అనుగుణంగా మిగిలిన 9.56 లక్షల ఇండ్లను కేటాయించాలని ఈ సందర్భంగా కేంద్రమంత్రి గారిని కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యాన్ని అందిస్తున్నామని, అలాగే సన్న వడ్లకు రూ. 500 బోనస్‌ను అందించి ప్రోత్సహిస్తున్నామని వివరించారు.