భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విగ్రహ దాత, అన్నదాన కార్యక్రమ నిర్వాహకులు మాచర్ల కవిత–శ్రీనివాస్ దంపతుల సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు కలిసి భక్తులకు అన్నదానం చేశారు. ఎల్కతుర్తి సీఐ కొండ్రు శీను, ఎస్సై నరసింహారావు, ఎల్కతుర్తి మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు మాచర్ల శంకర్, నారెడ్ల శంకర్, జన్ను సతీష్, ఐలవేణి బిక్షపతి తదితరులు కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా భోజనం వడ్డించారు.
అలాగే దండేపల్లి గ్రామ సర్పంచ్ గొలిపెల్లి సంపత్, ఉప సర్పంచ్ సందీప్, వార్డు సభ్యులు కట్కూరి బాబు, కట్కూరి శ్రీనివాస్ తదితరులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు భోజనం వడ్డించారు. కార్యక్రమం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ అన్నదానం అనేది అన్ని దానాల్లోకెల్లా గొప్పదానమని, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం ద్వారా మానవత్వాన్ని చాటుకోవచ్చని అన్నారు. సమాజంలో సేవా భావాన్ని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ప్రజలకు ఉపయోగపడే మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
దండేపల్లిలో నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. దీంతో గ్రామంలో ఆధ్యాత్మిక, సేవా భావ వాతావరణం నెలకొంది.