వివాదరహిత నాయకుడు.. ఆళ్ల నానికి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ నివాళి
భీమ్ ఇండియా టుడే న్యూస్ ఆంధ్రప్రదేశ్ ఏలూరు, సెప్టెంబర్ 16: ఆళ్ల నాని అకాల మరణం ఆయన కుటుంబానికి మాత్రమే కాదు, ఏలూరు ప్రజలకు కూడా తీరని లోటు అన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. బుధవారం మధ్యాహ్నం ఏలూరులోని ఆళ్ల నాని నివాసానికి చేరుకుని పార్థివ దేహంపై పూలమాల ఉంచి నివాళులర్పించిన అనంతరం ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఆళ్ల నాని ఏలూరు నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేశారనీ, ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా కూడా పనిచేసిన ఆళ్ల నాని వివాదరహితంగా పనిచేశారని కొనియాడారు. ఆళ్ల నాని తనతో ఎంతో స్నేహంగా ఉండేవారని చెబుతూ, ఇటీవల కూడా స్థానిక సంస్థల ఎన్నికల విషయంపై ఆళ్ల నానితో మాట్లాడటం జరిగిందని ఎంపీ l గుర్తుచేసుకున్నారు. నిన్న మధ్యాహ్నం సమయంలో ఆళ్ల నాని గారు గుండెపోటుతో మృతి చెందారనే వార్త తెలిసి నమ్మలేకపోయానన్న ఎంపీ, ఆళ్ల నాని మృతి తనను ఎంతగానో బాధించిందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్.. ఈ విషాద సమయంలో ఆ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నానని, ఆళ్ల నాని గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు.