BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 07 September 2026, 9:43 pm Posted by : Reporter Srikanth

జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఫిర్యాదుదారుని మామగారికి మెరుగైన వసతులు కల్పించడం

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన హుజూరాబాద్ సబ్ జైలర్…

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజూరాబాద్: ఖైదీకి సదుపాయాలు కల్పించేందుకు లంచం డిమాండ్ చేసి, తీసుకుంటూ హుజూరాబాద్ సబ్ జైలర్, పెట్రోల్ బంక్ ఆపరేటర్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సబ్ జైలు డిప్యూటీ జైలర్ నాంపల్లి దేవేందర్ (46)… జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఫిర్యాదుదారుని మామగారికి మెరుగైన వసతులు కల్పించడం, ములాఖత్‌లకు అనుమతించడం, ఖమ్మం జైలుకు బదిలీ కాకుండా చూసేందుకు రూ.10,000 లంచం డిమాండ్ చేశారు. బాధితుడు ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో సోమవారం సాయంత్రం సుమారు 5:45 గంటల సమయంలో, ఇండియన్ ఆయిల్ సబ్ జైల్ పెట్రోల్ బంక్ ఆపరేటర్ రావుల హరీశ్ (30) ద్వారా డిప్యూటీ జైలర్ దేవేందర్ రూ.10,000 లంచం తీసుకుంటుండగా కరీంనగర్ ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. పెట్రోల్ బంక్ ఆపరేటర్ వద్ద నుంచి రసాయన పరీక్షల అనంతరం నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డిప్యూటీ జైలర్ దేవేందర్ (ఏ-1), బంక్ ఆపరేటర్ హరీశ్ (ఏ-2)లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్ 1064 లేదా వాట్సాప్ నంబర్ 9440446106 ద్వారా సంప్రదించాలని అధికారులు సూచించారు…