BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 28 August 2026, 2:27 am Posted by : Reporter Srikanth

పెండింగ్‌లో ఉన్న డీఏలను తక్షణమే విడుదల

భీమ్ ఇండియా టుడే న్యూస్ భూపాలపల్లి గణపురం:రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ (టాప్రా) జిల్లా అధ్యక్షుడు బోనాల రాజమౌళి డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటి పిలుపు మేరకు గురువారం జయశంకర్‌ భూపాలపల్లి కలెక్టరేట్‌ ఎదుట ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు నల్లబ్యాడ్జీలు ధరించి భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బోనాల రాజమౌళి మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న డీఏలను తక్షణమే విడుదల చేయాలని, పీఆర్సీ నివేదికను తెప్పించి వేతన సవరణను అమలు చేయాలని కోరారు. విశ్రాంత ఉద్యోగులకు రావాల్సిన గ్రాట్యుటీ, కమ్యుటేషన్‌, సరెండర్‌ లీవ్‌ తదితర బెనిఫిట్లను ఏకకాలంలో జమ చేయడంతో పాటు, ఈహెచ్‌ఎస్‌ ద్వారా నగదు రహిత వైద్యాన్ని పకడ్బందీగా అందించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే సెప్టెంబర్‌ 10న హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ వద్ద చేపట్టే మహాధర్నాలో భారీ ఎత్తున పాల్గొంటామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కన్వీనర్‌ జేసీ విజయలక్ష్మి, బూర్గుల రవి, రేగూరి సుభాకర్ రెడ్డి తదితర ఉపాధ్యాయులు, పెన్షనర్లు పాల్గొన్నారు.