భీమ్ ఇండియా టుడే న్యూస్ కమలాపూర్ గూడూర్ ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం
పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి: హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఓడితల ప్రణవ్ బాబు
కమలాపూర్ మండలం, గూడూరు: పేద, నిరుపేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా లబ్ధిదారుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఓడితల ప్రణవ్ బాబు అన్నారు.
బుధవారం కమలాపూర్ మండలం గూడూరు గ్రామంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి ఓడితల ప్రణవ్ బాబు ముఖ్య అతిథిగా హాజరై, నూతన గృహాల్లోకి ప్రవేశించిన లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా సొంత ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎంతో భరోసానిస్తోందన్నారు.
పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. పేదోళ్ల సొంతింటి కలను నెరవేర్చుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రణవ్ బాబు కోరారు.
ఇందిరమ్మ ఇల్లు కేవలం ఒక భవనం మాత్రమే కాదని, పేద కుటుంబానికి ఆత్మగౌరవం, భద్రత, భవిష్యత్తుకు భరోసా అని ఆయన పేర్కొన్నారు. గూడూరు గ్రామంలో లబ్ధిదారుల కుటుంబాల్లో గృహప్రవేశ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య జరగడం సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి రవీందర్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు వాసాల శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలసాని రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్ల రమేష్, మాజీ ఎంపీపీ తడక శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాక చంద్రమౌళి, భాష బోయిన రమేష్, గాలిబు నవీన్, కొండపాక మనీష్, ఎర్రగొల్ల రాజు తదితరులు పాల్గొన్నారు.
అలాగే గూడూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని గృహప్రవేశ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.