భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజూరాబాద్ నియోజకవర్గం లో కమలాపూర్ లో డబుల్ బెడ్రూం ఇళ్లపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
వారంలో ఇస్తామన్నారు.. పది రోజులైనా జాబితా లేదు! డబుల్ బెడ్రూం ఇళ్లపై ప్రభుత్వ నిర్లక్ష్యం
కేసీఆర్ కట్టించిన ఇళ్లను పేదలకు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోంది
కమలాపూర్: కమలాపూర్ మండల కేంద్రంలో నిర్మించిన 394 డబుల్ బెడ్రూం ఇళ్లను వెంటనే అర్హులైన పేదలకు కేటాయించాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కమలాపూర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో సుమారు రూ.20 కోట్ల వ్యయంతో ఈ డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టారని, ఒక్కో ఫ్లాట్కు సుమారు రూ.5.04 లక్షల చొప్పున ఖర్చు చేశారని తెలిపారు. అదనంగా రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ, తాగునీటి వంటి మౌలిక వసతుల కల్పన కోసం ఒక్కో ఇంటికి రూ.1.25 లక్షల చొప్పున మొత్తం సుమారు రూ.4.92 కోట్లను కూడా మంజూరు చేశారని గుర్తు చేశారు.
ఇటీవల కమలాపూర్కు వచ్చిన హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్లు డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీని ప్రారంభిస్తూ వారం రోజుల్లో లబ్ధిదారుల పేర్లు ప్రకటించి ప్రొసీడింగ్స్ అందజేస్తామని చెప్పారని, కానీ పది రోజులు గడిచినా ఇప్పటి వరకు లబ్ధిదారుల జాబితా విడుదల చేయకపోవడం, ప్రొసీడింగ్స్ ఇవ్వకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.
లబ్ధిదారుల పేర్లు ప్రకటించినా వారు నివసించే పరిస్థితి ప్రస్తుతం లేదని, గృహ సముదాయాల్లో రోడ్లు పూర్తికాలేదని, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వలేదని, తాగునీటి సౌకర్యం లేదని, డ్రైనేజీ పనులు అసంపూర్తిగా ఉన్నాయని, అనేక ఇళ్లలో అద్దాలు పగిలిపోయాయని, బాత్రూమ్లు, తలుపులు కూడా సరిగా లేవని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలను ఇళ్లలోకి పంపడం సరైన విధానం కాదన్నారు. కమలాపూర్తో పాటు గూడూరు, మరిపల్లిగూడెం ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని తెలిపారు.
కేసీఆర్ నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రులు ఆయన పేరును ప్రస్తావించకపోవడం బాధాకరమన్నారు. ఇళ్లను నిర్మించింది కేసీఆర్ ప్రభుత్వమేనని, ఆ విషయాన్ని ప్రజలకు చెప్పకుండా రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు.
డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయని, లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారనే ఆడియోలు కూడా బయటకు వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి, అవకతవకలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
డబుల్ బెడ్రూం ఇళ్లు నిజమైన పేదల కోసమే నిర్మించారని, ఇల్లు లేని అర్హులైన కుటుంబాలకు మాత్రమే కేటాయించాలని, అనర్హులకు ఇళ్లు కేటాయించినట్లు తేలితే ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వృద్ధాప్య, వికలాంగుల పెన్షన్ల పెంపు, మహిళలకు ప్రకటించిన హామీలు, ఇతర సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.
హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను ప్రశ్నించేందుకు తనను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని, ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తన బాధ్యత అని అన్నారు. కమలాపూర్లోని 394, గూడూరులోని 50, మరిపల్లిగూడెంలోని డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల జాబితాలను వెంటనే ప్రకటించి, ప్రొసీడింగ్స్ అందజేసి, మౌలిక వసతులు పూర్తి చేసి ఇళ్లను అప్పగించాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో లబ్ధిదారులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగుతామని, ప్రభుత్వం ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ SC కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ గారు, మాజీ మార్కెట్ చైర్మన్ పోల్నేని సత్యనారాయణరావు గారు, కమలాపూర్ మండల సీనియర్ నాయకులు, పీఏసీఎస్ చైర్మన్ సంపత్రావు గారు, తక్కలపల్లి సత్యనారాయణరావు గారు, ఇంద్రసేనారెడ్డి గారు, మాజీ జెడ్పీటీసీలు నవీన్ గారు, లక్ష్మణ్ గారు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రాజేష్ గారు, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.