ఏపూరి పాటల ప్రవాహ సభలో గళమెత్తిన కళాకారులు – ప్రభుత్వాలు మారినా కళాకారుల కన్నీళ్లు ఆగలేదని ఆవేదన
బీమ్ఇండియాటుడేరవీంద్ర భారతి: చట్టసభల్లో కళాకారులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని, ప్రజా ఉద్యమాల్లో పాటను ఆయుధంగా మలిచిన కళాకారులకు రాజకీయంగా కూడా సముచిత గౌరవం, హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తూ **“ఏపూరి పాటల ప్రవాహ సభ”**లో కళాకారులు గళమెత్తారు.
సభలోపాల్గొన్న మీసాలగణేష్ మాట్లాడుతూ.. గద్దర్ అన్నతో కలిసి ఎన్నో రోజుల పాటు సాగిన తన ప్రయాణాన్ని, ఉద్యమాల్లో కళాకారుల పాత్రను గుర్తుచేసుకున్నారు. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కళాకారుల ఆవేదనలు మాత్రం తీరడం లేదని, ఎన్నో ఏళ్లుగా కళాకారులు తమ హక్కుల కోసం ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సింగారం రవీందర్ మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా కళాకారుల సమస్యలను అనేక వేదికలపై ప్రస్తావిస్తున్నప్పటికీ వారి ఆవేదనలు పట్టించుకోని పరిస్థితి కొనసాగుతోందన్నారు. ఇకనైనా ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా కళాకారులకు న్యాయం చేయాలని, చట్టసభల్లో కళాకారులకు హక్కు, వాటా కల్పించాల్సిందే అని డిమాండ్ చేశారు.
ఉద్యమాలకు ఊపిరిగా నిలిచిన పాట
మీసాల గణేష్ మాట్లాడుతూ.. గద్దర్ అన్నను స్మరిస్తూ, ఉద్యమాల్లో కళాకారులు చేసిన సేవలను గుర్తుచేశారు. జెండాలు మోసిన ప్రజలను సమీకరించడం, సభలకు జనాన్ని తీసుకురావడం, కరపత్రాలు పంచడం, పోస్టర్లు అతికించడం వంటి అనేక కార్యక్రమాల్లో కళాకారులు ముందుండి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని తెలిపారు.
బహుజన మన బతుకెన్నడు మారురో మహాజన” వంటి పాటలు ప్రజల బాధలను, ఆకాంక్షలను ప్రతిబింబించాయని అన్నారు. అలాగే బండి యాదగిరి పాటలు ఉద్యమానికి బలాన్నిచ్చాయని, గద్దర్ పాటలు పాలకులను ప్రశ్నిస్తూ ప్రజల గొంతుకగా నిలిచాయని గుర్తుచేశారు.

ఏపూరి సోమన్న పాటలు.. ప్రజల గొంతుక
తెలంగాణ ప్రజల సమస్యలు, ఆవేదనలు, పాలకుల తీరును ప్రశ్నిస్తూ ఏపూరి సోమన్న పాటలు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చాయని సభలో వక్తలు పేర్కొన్నారు. పాట కేవలం వినోదం కాదని, అది ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లే శక్తివంతమైన ఆయుధమని అన్నారు.
బరిపాటి రాములు మాట్లాడుతూ.. కళాకారులు ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించినప్పటికీ, వారికి అధికారంలో తగిన భాగస్వామ్యం ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు. “అన్నీ ఇస్తున్నారు గాని తమ్ముడా.. అధికారము ఎందుకు ఇస్తలేరు? అడుగుదాం లేచిపోదాం” అనే నినాదంతో కళాకారుల హక్కుల కోసం పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు.
“పాటకు వాటా వచ్చే వరకు పోరాటం ఆగదు”
మహాజన సురేష్ కళాకారులకు చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం, గౌరవం, హక్కు కల్పించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని సభలో స్పష్టం చేశారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కళాకారుల సేవలను గుర్తించి వారికి రాజకీయ, సామాజిక ప్రాధాన్యత కల్పించాల్సిందేనని డిమాండ్ చేశారు.
ప్రజా ఉద్యమాలకు ఊపిరిగా నిలిచిన పాటకు.. ఇక చట్టసభల్లోనూ వాటా కావాలనే డిమాండ్తో ఏపూరి పాటల ప్రవాహ సభలో కళాకారులు తమ గళాన్ని మరింత బలంగా వినిపించారు.