దివ్యాంగ బాలుడి ఆకాంక్షను నెరవేర్చిన మల్కాజిగిరి సీపీ
రాహుల్తో కరచాలనం చేస్తున్న సీపీ సుమతి
భీమ్ ఇండియా టుడే హైదరాబాద్ : పుట్టుకతోనే వైకల్యంతో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్న ఓ బాలుడి చిరకాల ఆకాంక్షను మల్కాజిగిరి సీపీ సుమతి నెరవేర్చారు. ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన తిరుమలరావు, రాధమ్మ దంపతుల కుమారుడు రాహుల్ పుట్టుకతోనే వైకల్యంతో బాధపడుతున్నాడు. రెండు కాళ్లు ఉన్నప్పటికీ నడవలేని పరిస్థితి. మాటలు కూడా సరిగా రావు. తాను ఒక్కరోజైనా పోలీస్ కమిషనర్ అవ్వాలని కలలు కనే వాడినని కుటుంబ సభ్యుల ముందు ప్రస్తావించేవాడు. విషయం తెలుసుకున్న సీపీ సుమతి తన కార్యాలయానికి తీసుకురావాలని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. సోమవారం నేరేడ్మెట్లోని కమిషనరేట్కు వచ్చిన రాహుల్ను తన కార్యాలయంలోని కుర్చీలో కూర్చోబెట్టారు. ‘నీ కోరిక తీరిందా రాహుల్..?’ అంటూ ఆప్యాయంగా పలకరించి భుజం తట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. దివ్యాంగులపై ప్రతి ఒక్కరూ ఆదరణ చూపాలని, స్వచ్ఛంద సంస్థలు మరింత అండగా నిలవాలని పిలుపునిచ్చారు. రాహుల్ తల్లిదండ్రులు సీపీ సుమతి, ప్రతిమ ఫౌండేషన్ ఛైర్మన్ రష్మిత, తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు.