BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 27 July 2026, 10:29 am Posted by : Reporter Srikanth

అనిశా దూకుడు

  • రూ.100 కోట్లకు పైగా అక్రమాస్తులున్న వారిపై దృష్టి

 భీమ్ ఇండియా టుడే న్యూస్  గోదావరిఖని :ఇటీవల కాలంలో అనిశా అధికారులు దూకుడు పెంచారు. అవినీతి అధికారులను పట్టుకోవడంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. చిన్న చిన్న అధికారులు కాకుండా రూ.వంద కోట్లకు మించి అక్రమాస్తులు కూడగట్టిన వారి చిట్టాను సేకరిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులపై ఫిర్యాదులు వెళ్లిన నేపథ్యంలో భారీగా అక్రమాలకు పాల్పడ్డ వారిపై దృష్టి సారించారు. అలాంటి వారి వివరాలు, పూర్తి ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. పక్కా సమాచారం సేకరించిన తర్వాతనే సోదాలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో ముఖ్యంగా రెవెన్యూ, పోలీసు, స్టాంపులు, రిజిస్ట్రేషన్, సర్వే, పురపాలక శాఖల్లో పనిచేసే అధికారులపై దృష్టి సారించారు. ఈ శాఖల్లో ఎక్కువగా అవినీతి జరిగే అవకాశం ఉండటంతో ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.

రిజిస్ట్రేషన్‌ శాఖపై గురి

ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖకు చెందిన నలుగురు అధికారులను అనిశా అధికారులు పట్టుకున్నారు. భూముల రిజిస్ట్రేషన్లలో భారీగా అవినీతి సాగుతోంది. భూముల క్రయవిక్రయాల సమయంలో ఏదో ఒక కొర్రీ పెట్టి డబ్బులు గుంజుతున్న కేసులను గుర్తించారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు 21 మంది ప్రభుత్వ అధికారులు, సిబ్బందిని అనిశా అధికారులు పట్టుకున్నారు. ఇందులో రిజిస్ట్రేషన్‌ శాఖకు చెందిన నలుగురు ఉండగా భూసర్వే విభాగంలో ముగ్గురు, రెవెన్యూ, పోలీసు, ఆబ్కారీ శాఖలకు చెందిన ఇద్దరు చొప్పున పట్టుబడ్డారు. అనిశా అధికారులు కూడా ఇవే శాఖలపై నిఘా పెట్టి భారీ తిమింగలాలను పట్టుకోవడానికి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రతిపనికి ఓ రేటు

ప్రభుత్వ శాఖల్లో ప్రతి పనికి ఓ రేటు చొప్పున లంచాలు గుంజుతున్నారు. ప్రభుత్వ శాఖలో లంచం ఇవ్వనిదే దస్త్రాలు కదలని పరిస్థితి. అవినీతికి మరిగి ఎదుటి వారి బలహీనతలను సొమ్ము చేసుకొంటున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుండటంతో అనిశా అధికారులకు పూర్తి స్వేచ్ఛ కల్పించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అవినీతి ద్వారా భారీ మొత్తంలో అక్రమాస్తులు కూడగట్టిన వారిపై నిఘా పెట్టినట్లు తెలిసింది. పూర్తి సమాచారం సేకరించిన తర్వాత విడతల వారీగా ఒక్కో అవినీతి అధికారుల ఆస్తులపై సోదాలు చేపట్టనున్నారు.