రైతులకు వ్యవసాయ శాఖ సూచనలు
హుజురాబాద్, జూలై 16 (BheemIndiaToday):** ఎల్నినో ప్రభావం కారణంగా రానున్న రోజుల్లో నీటి లభ్యత తగ్గే అవకాశం ఉన్నందున రైతులు వ్యవసాయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. గురువారం హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏఈఓ నిఖిల్ కుమార్ మాట్లాడుతూ రైతులు తమ మొత్తం వ్యవసాయ విస్తీర్ణంలో వరి సాగు చేయకుండా కొంత భాగంలో ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. రానున్న రోజుల్లో బోర్లు, చెరువుల ద్వారా నీటి లభ్యత మరింత తగ్గే అవకాశం ఉన్నందున నీటిని పొదుపుగా వినియోగిస్తూ తక్కువ నీటితో సాగు చేయగల పంటలను ఎంచుకోవాలని తెలిపారు.
జొన్న, పెసలు, మినుములు, కంది, పొద్దుతిరుగుడు, ఆముదం, చిరుధాన్యాలు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం ద్వారా రైతులు నీటి కొరత వల్ల కలిగే నష్టాలను తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వరి సాగును కొంత మేర తగ్గించి ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మూషం సంగీత, ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు వన్నాల శివాజీ, గ్రామ కార్యదర్శి మహేందర్ రెడ్డి, ఆదర్శ రైతు బాల్ రెడ్డి, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.